Thursday, January 1, 2009

మన కుటుంబ జీవితం ప్రమాదంలో పడింది

(బ్లాగ్మితృలందరికీ 2009 నూతన సంవత్సర శుభాకాంక్షలు.

సమాజ హితాన్ని కోరే చర్చలకు ఆహ్వానం పలుకుతూ బ్లాగర్లందరూ టపాలు రాయగలిగే విధంగా ‘అభివృద్ధి-మనుగడ’ అనే ఉమ్మడి బ్లాగును ఏర్పాటు చేసినందుకు సీతారాంరెడ్డి గారికి అభినందనలు మరియు కృతజ్ఞతలు)

ఒక వ్యక్తి కుటుంబంలో కొనసాగే విధానానికీ, సమాజంలో కొనసాగే విధానానికీ చాలా తేడా ఉంటుంది. కుటుంబంలోని వ్యక్తి బాల్యం వలనో, వృద్ధాప్యం వలనో లేక మరేదైనా కారణం వలనో డబ్బు సంపాదించలేకపోయినా కూడా మిగతా కుటుంబ సభ్యులతో సమానంగా తన అవసరాలను తీర్చుకోవచ్చు.. అన్నీ అనుభవించవచ్చు. కానీ సమాజంలో అలా కాదు. ఎవరు సంపాదించినది వారికే. ఎవ్వరూ ఎవరికీ ఇవ్వరు. శక్తి కలిగి ఎక్కువ సంపాదించగలిగితే కోట్లు కూడబెట్టవచ్చు. ఆ ఆస్తి నంతా మన అనుభవానికి అట్టిపెట్టుకోవచ్చు. శక్తి లేక సంపాదించలేకపోతే నిష్టదరిద్రాన్నైనా అనుభవించక తప్పదు. ఆ పరిస్థితిని మిగతావారు చూస్తూ ఉండిపోతారు తప్ప పెద్దగా ఎవరూ ఆదుకోరు. తప్పు వారిది కాదు. వ్యవస్థే వారినలా నిర్దేశించినది.

ఇటువంటి వ్యవస్థ వలనే కుటుంబ జీవితం కష్టభూయిష్టంగా మారింది. సమాజంలో కొద్దిమంది సకల సుఖాలు అనుభవిస్తుంటే అనేకులు తమ అవసరాలు తీరక అప్పులతోనో, గర్భదరిద్రంతోనో కాలం వెళ్ళబుచ్చుతున్నారు. కొందరు ఆత్మహత్యతో అటువంటి బ్రతుకు నుండి విముక్తి పొందుతున్నారు. ప్రస్తుత సామాజిక వ్యవస్థలో మనిషి యొక్క కనీస జీవన ప్రమాణాలకు ఎటువంటి హామీ లేదు. సామాజిక జీవితం అనేది ప్రతిఒక్కరికి కూడా… ఓడిపోతే తమ సుఖసంతోషాలను, తమ సౌభాగ్యాలను, ఆఖరికి తమ ప్రాణాలనే ఒడ్డవలసిన ‘తప్పనిసరి జూదం’ గా మారింది. సమాజంలో అనేకమంది శాపగ్రస్థ జీవితం గడపవలసిన పరిస్థితి ఏర్పడింది.

ప్రేమ, ఆప్యాయతలకోసం, ‘నా’ అనే వారి కోసం వ్యక్తి కుటుంబాన్ని ఏర్పరచుకుంటే, దాన్ని అవకాశంగా తీసుకుని ఆ కుటుంబ సభ్యుల భారమంతా అతనే వహించాలనటంలో ఏపాటి హేతుబద్ధత ఉన్నది ?! నిజమే…వ్యవస్థీకృత నేపథ్యం ‘కుటుంబ యజమానే కుటుంబ సభ్యులనందరినీ పోషించాలి’ అన్నట్లుగా ఉన్నది. ‘ఇది చాలా సహజసిద్ధమైన బాధ్యత’ అన్నట్లుగా ఉన్నది. (కనుకనే ఎవరూ మారు పలకకుండా ఈ బాధ్యత నిర్వహిస్తున్నారు) కనుక మనం ఈ నేపథ్యం కన్నా అతీతంగా, మరింత మౌలికంగా ఆలోచించాలి.

అసలు ఈ భూమి మీద మనుగడ సాగించే మనిషి పోషణాభారం ఎవరిది ? అతని అవసరాలు తీర్చే బాధ్యత ఎవరిది ?

…మనిషినే కాదు, ఏ జీవినైనా పోషించవలసినది, పోషించగలిగినది ఎన్నో వనరులున్న ప్రకృతే. సామాజిక జీవి ఐన మనిషి విషయంలోనైతే ఆ ప్రకృతి వనరులను తన అధీనంలో ఉంచుకున్న సమాజానిది. మరైతే మనుషులలో ఈ బాధ్యత సమాజం మీద కాక కుటుంబ యజమాని మీద ఎందుకు పడింది ?.. అదే సమాజంలోని వ్యవస్థీకృత దోషం.

సమాజానికి తనలో జీవించే ప్రతి మనిషి యొక్క ప్రతి అవసరం తీర్చే శక్తి ఉన్నది. కానీ ప్రజలు పేదరికంలో మగ్గటానికి కారణం మనుషుల పోషణాభారం సమాజం మీద కాక కుటుంబం మీద ఉండటమే. ఒక పక్క గిడ్డంగులలో లక్షలాది టన్నుల ఆహార నిల్వలు కదలకుండా పడి ఉండటం, మరో పక్క అదే సమాజంలో కోట్లాది ప్రజలు తిండిలేక పస్తులుండటానికి ఇదే కారణం.

ఏ కారణం చేతనైనా కుటుంబ ఆదాయ వనరులు క్షీణిస్తే, ప్రస్తుత వ్యవస్థలో కుటుంబ సభ్యులంతా తమ అవసరాలు తీరక అల్లాడిపోతారు. కానీ వ్యక్తుల పోషణాభారం సమాజం మీద ఉండటం వలన ఎవరికీ ఈ దురవస్థ ప్రాప్తించదు. ఎందుకంటే ఏ కారణం చేత కూడా సమాజం ప్రజల అవసరాలను తీర్చలేని దుస్థితిలో ఉండదు. సమాజం యొక్క శక్తిసామర్ధ్యాలు అతినిశ్చితమైనవి. కుటుంబ యజమాని యొక్క శక్తి సామర్ధ్యాలు అలా కాక అనిశ్చితమైనవి (uncertain). అందువలన కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చే బాధ్యతను అతను నెరవేర్చవచ్చు లేక నెరవేర్చలేకపోవచ్చు. నెరవేర్చలేకపోవడమే పేదరికం. అప్రతిహతమైన శక్తి సామర్ధ్యాలను తనలో నిబిడీకృతం చేసుకొని ఉన్న సమాజం మాత్రం తనలోని ప్రతిఒక్కరి, ప్రతిఒక్క అవసరం ఖచ్చితంగా తీర్చగలుగుతుంది. అయితే అందుకు తగిన సామాజిక వ్యవస్థీకరణ లేకపోవడం వలన మాత్రమే ఈ సౌకర్యం ప్రజలకు అందుబాటులోకి రావడంలేదు.

ప్రజల కష్టాల నిర్మూలన కొరకు ప్రస్తుత వ్యవస్థ పరిధిలో వెదికే పరిష్కార మార్గాలన్నీ ఎండమావులే. వ్యవస్థ మార్పే అసలైన పరిష్కారం.

ప్రస్తుత వ్యవస్థలో సమాజం నెరవేర్చవలసిన బాధ్యతలను కుటుంబం మీదకు నెట్టడంతో తనవి కాని బాధ్యతలతో కుటుంబం కష్టాల వేదికగా మారింది. అన్ని బాధ్యతలు నెరవేర్చగలిన సమాజమేమో, ఏ బాధ్యతా లేకుండా కేవలం కొందరు స్వార్ధపరుల క్రీడాప్రాంగణంగా మారింది. వ్యక్తుల పోషణాభారం నుండి, వారి అవసరాలను తీర్చే బాధ్యత నుండి కుటుంబానికి విముక్తి కల్పించి ఆ బాధ్యతను సమాజానికి విధించాలి. అప్పుడే కుటుంబం కష్టాలమయమైన తన అసహజ రూపాన్ని వదలి, తన సహజ స్థితి అయిన ప్రేమ, ఆప్యాయతల నిలయంగా మారుతుంది.

ఎంతో సృజనశీలి, కార్యశీలి అయిన మానవుడు అసమర్ధుడై పేదవాడు కాలేదు. అసహజమైన బాధ్యతల బరువుతో మాత్రమే పేదవాడయ్యాడు. కుటుంబమనే బండిని లాగే కాడెద్దు కాదు మానవుడు. అతని జీవితం మరెంతో ఉన్నత విషయాలనుద్దేశించినది. అయితే ప్రస్తుత వ్యవస్థ మనిషిని ఆ కాడెద్దుగానే మార్చింది. మనసున్న ప్రతి ఒకరూ ఈ పరిస్థితిని ఎదిరించాలి. వ్యవస్థ మార్పుకొరకు ఆలోచించాలి. (written by Saraswathi Kumar)

4 comments:

  1. సీతారాం రెడ్డి ప్రారంభించిన చర్చ లో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు.

    సమాజం, వ్యక్తి ల సమన్వయ లోపం వలన ప్రస్తుత పరిస్థితి అధ్వాన్నంగా వున్నది అని అంటున్నారు. ఇది నిజమే. ఏకీభవిస్తున్నాను.

    ఈ సమన్వయ లోపానికి కారణం ఏమిటి?

    నాకున్న అవగాహన వరకు మన దేశం సంబందించిన వరకు మన గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేసే పాచ్యాత్య దేశాల అభివృద్ధి నమూనాను రుద్డటమే ఈ పరిస్థితికి కారణం.

    అంటే మన గ్రామీణ వ్యవస్థలో లోపాలు లేవని అనలేము. కాని ప్రతి వ్యక్తికి స్థానం వున్నది.

    మన గ్రామీణ వ్యవస్థలో కులవ్యవస్థ పెద్ద లోపమే, కాని కొంతవరకు వ్యక్తిని, సమాజాని సమన్వయము చేసినది ఈ కులవ్యవస్తే అనిపిస్తుంది.

    గ్రామంలో ఒక కులం లేకుంటే వ్యవహారం (అంటే పురుడు, పెళ్లి, చావు మొ.)జరగటం చాలా అసహజంగా భావించేఅవారు. వ్యవసాయమైతే చాలా కులాల సమన్వయంతో మాత్రమే సాగేది.

    మన వ్యవస్థలోని కులాలలోని అంతరాలను తగ్గిస్తే ఒక మంచి వ్యవస్థగా రూపాంతరం చెందేది.

    ఇప్పుడు గ్రామీణ వ్యవస్థని పునర్నిర్మితం చేయటం సాధ్యం కాదు.

    ఎందుకంటే మనం పరుల అభివృద్ది నమూనాను తీసుకొని చాలా దూరం వచ్చినాము. వెనకకు పోలేము. ముందుకు మాత్రమె పోవాలి. సరియైన మార్గం ఇప్పుడు ఎంచుకోవాలి.

    మనిషి ప్రాధమికమైన వ్రుత్తి వ్యవసాయం ఇప్పుడు కొద్ది మంది వ్రుత్తి గా మారినది. మనిషి మనుగడకు తిండి ప్రాధమిక అవసరం. మనిషి ద్వితీయ (సెకండరి) అవసరాలు చాలా పెరిగినాయి. మనిషి సెకండరి అవసరాల కొరకే చాలా మంది రకరకాల వృత్తులలోకి మార్పు చెందినారు.

    వ్యవసాయాని, ఇతర వృత్తులను సమన్వయము చేసే ఒక మనగలిగిన చిన్న వ్యవస్థలు ఇప్పుడు అవసరం.

    ReplyDelete
  2. కుటుంబంలో మనుష్యుల మధ్య ప్రత్యక్ష సంబంధాలుంటాయి. కానీ సమాజంలోని మనుష్యులందరి మధ్యన అలాంటి ప్రత్యక్ష్య సంబంధాలుండవు కాబట్టి సమాజం పట్టించుకోదు. మీరు ఉత్పత్తి శక్తులు సమాజం చేతిలో ఉన్నట్లుగా రాశారు. అవి వ్యక్తుల చేతుల్లో, కుటుంబాల చేతుల్లోనే ఉన్నాయి కదా.

    కుటుంబాన్ని సమాజం పత్తించుకోవాలనడం కంటే రాజ్యము, ప్రభుత్వము పట్టించుకోవాలనీ అది మాత్రమే సాధ్యమని నా అభిప్రాయం.

    అసలు సమాజము రాజ్యము ఒక్కటేనని నా అభిప్రాయము. సమాజపు వ్యవస్థీకృత రూపమే రాజ్యము లేదా ప్రభుత్వము.

    ReplyDelete
  3. "కుటుంబంలో మనుష్యుల మధ్య ప్రత్యక్ష సంబంధాలుంటాయి. కానీ సమాజంలోని మనుష్యులందరి మధ్యన అలాంటి ప్రత్యక్ష్య సంబంధాలుండవు కాబట్టి సమాజం పట్టించుకోదు. మీరు ఉత్పత్తి శక్తులు సమాజం చేతిలో ఉన్నట్లుగా రాశారు. అవి వ్యక్తుల చేతుల్లో, కుటుంబాల చేతుల్లోనే ఉన్నాయి కదా."

    ఉత్పత్తి శక్తులు వ్యక్తుల చేతుల్లో, కుటుంబాల చేతుల్లో ఉన్నాయి. నిజమే! కానీ ప్రతి వ్యక్తి చేతిలో, ప్రతి కుటుంబం చేతిలో లేవుకదా!

    ఒక కుటుంబంలో మనిషికి ఎటువంటి రక్షణ లభిస్తుందో అటువంటి రక్షణే సమాజంలో కూడా లభించాలన్నదే నా అభిప్రాయం.

    "కుటుంబాన్ని సమాజం పట్టించుకోవాలనడం కంటే రాజ్యము, ప్రభుత్వము పట్టించుకోవాలనీ అది మాత్రమే సాధ్యమని నా అభిప్రాయం."

    ఔను మీరన్నది నిజమే!

    రాజ్యం లేక ప్రభుత్వం శాసనం ద్వారా ఆ విధంగా వ్యవస్థీకరణ చేయాలి.

    "అసలు సమాజము రాజ్యము ఒక్కటేనని నా అభిప్రాయము. సమాజపు వ్యవస్థీకృత రూపమే రాజ్యము లేదా ప్రభుత్వము."

    'రాజ్యం', 'సమాజం', 'వ్యక్తి ' అనే భావనలను నా అధ్యయనంలో ఏ అర్థాలతో వాడతానో ముందే తెలియజేశాను.

    --సరస్వతీ కుమార్

    ReplyDelete
  4. sarasvati gari abhipraayam to nenu ekeebhavistunnaanu.

    ReplyDelete